మన పవిత్ర భారతదేశం ఎన్నో దివ్యక్షేత్రాలకి పుణ్యతీర్థాలకి నిలయం. ఈ దివ్యభూమిలో ఎందరో దేవతలు తమ తమ అంశలని నిలిపి, ఈ ధరిత్రిని పవిత్రం చేసారు. మన దేశంలో వివిధ దేవతలకి సంబంధించిన వివిధ పుణ్యక్షేత్రాలు వున్నాయి. అయితే వీటిలో శక్తి ప్రధానక్షేత్రాలుగా అష్టాదశ శక్తిపీఠాలు. 52 ఉపశక్తి పీఠాలు. 108 శక్తిపీఠాలు ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి.
సృష్టి స్థితి లయకారిణి అయిన ఆ ఆదిపరాశక్తి అంశలు ఈ శక్తిపీఠాల్లో కొలువుండటం వల్ల వీటి మహత్యం ఎంతో గొప్పదిగా పురాణాలు చెబుతాయి. ఈ మహాశక్తిపీఠాలలో అత్యంత ప్రధానమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. పూర్వం దక్షయజ్ఞ సమయంలో తండ్రిచేత అవమానించబడ్డ పార్వతీదేవి యోగాగ్ని ద్వారా తన శరీరాన్ని త్యజించగా, దేవి శరీరాన్ని భుజంపై వేసుకున్న శివుడు ఉన్మత్తుడై ప్రళయతాండవం చేయసాగాడు. అప్పుడు విష్ణుమూర్తి దేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండించగా ఆ శరీరం నుంచి వెలువడిన భాగాలు భూమిమీద వివిధ ప్రాంతాలలో పడ్డాయి. అలా పడిన ప్రదేశాలలో సతీదేవి శరీరంలోని ముఖ్యమైన భాగాలు పడిన ప్రాంతాలు అష్టాదశ శక్తిపీఠాలుగా విఖ్యాతి పొందగా, మిగిలిన భాగాలుపడిన ప్రదేశాలు 52 శక్తిపీఠాలుగా, 108 శక్తిక్షేత్రాలుగా సుప్రసిద్ధమయ్యాయి.
ఈ అష్టాదశ శక్తిపీఠాలు, 52 శక్తిపీఠాలు, 108 శక్తిపీఠాల ప్రాంతాల్ని నిర్ణయించే విషయంలో పండితుల మధ్య ఎన్నో భేదాభిప్రాయాలున్నాయి. అయితే చాలామంది అంగీకరించిన ప్రాంతాల్ని ఈ గ్రంథంలో పొందుపరిచాం. వీటితో పాటు, 51 శక్తిపీఠాల స్థానాలని 108 శక్తిపీఠాల అధిష్ఠాన దేవతల పేర్లతో మత్స్యపురాణంలో చెప్పబడిన అష్టోత్తర శతనామావళిని శ్రీ లలితాసహస్రనామ స్తోత్రాన్ని కూడా ఇదే గ్రంథంలో మీకందిస్తున్నాం.
మహాశక్తి ఉపాసకులందరినీ ఈ గ్రంథం అలరిస్తుందని ఆశిస్తూ నమస్కారాలతో...
- ప్రకాశకులు
