-
-
దొంగ తల్లిదండ్రులుంటారు జాగ్రత్త!
Donga Tallidandruluntaru Jagratta
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 406Language: Telugu
తల్లిదండ్రులు నిర్దయులైతే, మూర్ఖులైతే, జాగ్రత్తలు పడవలసింది ఎవరు?
- ఇంకెవరు? వాళ్ళ చేతుల్లో చిక్కి వున్న పిల్లలే.
చంటి పిల్లలకి కూడా ఇంట్లో రక రకాల అవమానాలు జరుగుతూ వుంటాయి. వాళ్ళు, పిల్లలు! అమాయకులు! నిర్దోషులు! చిన్న వయసుల వాళ్ళు ఎలాంటి అల్లరి చేసినా, తప్పులు చేసినా, గట్టిగా మందలించడమే చివరి శిక్ష! పిల్లలకి,అంతకు మించిన శిక్ష అమానుషం! పిల్లల్ని బాదడం, వాళ్ళని హింసించడమే కాదు, అది ఘోరంగా అవమానించడం!
అయినా, పిల్లలేం జాగ్రత్తలు పడగలరు చిన్న వయసులో? పెద్ద వాళ్ళవుతూ వున్నప్పుడే తల్లిదండ్రుల చేష్టలూ స్వభావాలూ పిల్లలు అర్ధం చేసుకోవాలి. అర్ధం చేసుకుంటేనే దానికి తగిన జాగ్రత్తలతో వుండగలరు.
ఎదిగే పిల్లలే రేపు కొత్త తల్లిదండ్రులవుతారు.
చిన్నతనంలో, తమ తల్లిదండ్రుల వల్ల అవమానాలు పడ్డ పిల్లలు కొందరు, తామే తల్లిదండ్రులయ్యాక, తాము అనుభవించిన అవమానాలన్నీ తమ పిల్లలు కూడా పడవలసిందే అనుకుంటారు! ''మా రోజుల్లో మేం పడలేదా? మా పెద్దవాళ్ళు మమ్మల్ని అలా చెయ్యలేదా?'' అంటారు.టీచర్ల వల్ల క్రూరంగా దెబ్బలు తిన్న విద్యార్థుల్లో కొందరు, వాళ్ళే టీచర్లయితే, వాళ్ళు కూడ తమ విద్యార్థుల్ని క్రూరంగానే బాదుతారు. ఇంకా రకరకాలుగా హింసిస్తారు. అంటే, ''మా చిన్నప్పుడు మేం పడలేదా అవన్నీ?'' అని వాళ్ళ వాదన! అంతేగానీ, ''పెద్ద వాళ్ళ చేతుల్లో మనం పడ్డ అవమానాలు, మనం మళ్ళీ పిల్లలకు ఇచ్చి, మనం కూడా పాత వాళ్ళలాగే చెడ్డ వాళ్ళం అవుతామా?'' అనుకోరు.
ఒక తండ్రి, కొడుకు చేతిని తలుపుల మధ్య పెట్టి నొక్కేవాడు. అలాంటివి చాలా పడ్డ కొడుకు, పెద్ద వాడై, తల్లిదండ్రులతో మాట్లాడడం మానేశాడు. తండ్రిని అడిగితే, ''మా మేష్టారు మా చేతుల్ని టేబుల్లో పెట్టించి డెస్కు నొక్కేసేవాడు కదా?'' అన్నాడు. ''మీరూ అలాగే చేస్తారా?'' అని అడిగితే, ''ఏమో'' అన్నాడు. దీన్ని నేను ఏదో పుస్తకంలో రాశాను కూడా.
పెద్ద వాళ్ళు ఏ తప్పు చేస్తే అదే ఘన కార్యం కాదు. ఒక తరం వాళ్ళు చేసిన తప్పులు, ఇంకో తరం ద్వారా కూడా జరగకూడదు. అవి, రెండో తరంలో ఆగిపోవాలి. దొంగ తల్లిదండ్రులూ, దొంగ అత్త మామలూ, పాత కాలం నించీ వున్నారు. ''సతీ సహగమనాల'' ముచ్చట్లు నిర్వహించిన వాళ్ళందరూ తల్లిదండ్రులూ, అత్తమామలూ, కారూ? వాళ్ళే నిలబడి ఆ క్రూర కార్యాలు చేయించారు కదా?
ఈనాడు కూడా 'పరువు హత్యల' పేరుతో ఆడ పిల్లల్ని నరికి వేసేది తల్లిదండ్రులు కారూ?
పిల్లలు, హిమాలయ పర్వతాలెక్కే ఘన కార్యాలు చేసి డబ్బు సంపాదించాలనీ; పిల్లలు అక్కడ కొండల మధ్య రాలిపడి చచ్చినా, కొంత డబ్బు వస్తే చాలనీ; చూసే తల్లిదండ్రులు కూడా, తల్లిదండ్రులు కారూ? ఆ కొండల్లో పిల్లలకు ఏమవుతుందో అనే భయం అణువంతైనా తల్లిదండ్రులకు వుంటే, వారు దానికి ఒప్పుకుంటారా? కొండ లెక్కడంలో బోలెడు మంది పడిపోతున్నారనీ, చస్తున్నారనీ, తెలీదూ? - తెలుసు! కానీ, డబ్బు రావాలి. పిల్లలు పోతే పోతారు! - వాళ్ళే మరి తల్లిదండ్రులు!
ప్రతీ తల్లీ, ప్రతీ తండ్రీ, దొంగలు గానే ప్రవర్తిస్తారని చెప్పడమా ఇది? - కాదు. అలా చెప్పడం అయితే, నేనూ ఒక 'దొంగ తల్లి'నే అవుతాను. ప్రతీ ఒక్కరి గురించీ అదే అర్ధంతో చెప్పడం కాదు ఇది.
దొంగ తల్లిదండ్రుల పిల్లలు, తమ అవమానాలన్నీ ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. పెద్ద వాళ్ళయ్యాక, దేన్ని సహించాలో, దేన్ని తిరస్కరించాలో, ఆ రకంగా నడవాలి. తమ ప్రవర్తనలోకి క్రూర లక్షణాలు చేరనివ్వకుండా తమని తాము దృఢపరచుకోవాలి. - ఇదే, కొత్త తల్లిదండ్రులు తీసుకోవలిసిన జాగ్రత్త!
- రంగనాయకమ్మ
